కేసీఆర్ పాలనలో మహిళలకు కరువైన రక్షణ
విజయ డైరీని మూసేయడానికి ఆమూల్ మిల్స్ రాక
: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, మే 11 : కేసీఆర్ బీజేపీకి, మోడి అమిత్ షా లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేది శుద్ద అబద్ధం, వారి మధ్య బలమైన బంధం ఉన్నదని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అమిత్ షా కేంద్రంలో సహకార శాఖ మంత్రిగా ఉన్నారని అతని ఆదేశాలతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఆమోదం తెలిపారని విమర్శించారు ఆయన. ఇదే కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలోని నందిని పాల కంపెనీని మూసివేయాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడి అమూల్ కంపెనీని రానియ్యలేదని తెలిపారు.
తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ లోని వర్గల్ లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించారని విమర్శించారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు చెందిన విజయ పాల కంపెనీకి ప్రభుత్వం గత రెండేళ్లుగా కనీసం ఎండి ని కూడా ఎందుకు నియమించలేదని నిలదీశారు. రావిర్యాల ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడంలేదన్నారు.
కేంద్రంలో బిజేపి రిలయన్స్ కంపెనీ లాభాల కోసం బిఎస్ఎన్ఎల్ కంపెనీని చంపినట్లే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీలను చంపి, అమూల్ కంపెనీని తెస్తున్నారని మండిపడ్డారు ఆయన. కిసాన్ సర్కార్ అంటే రాష్ట్రంలోని పాడి రైతుల పొట్టకొట్టడమేనా అని ప్రశ్నించారు ఆయన. కిసాన్ సర్కార్ నినాదం రైతులను మోసం చేయడానికేనని పేర్కొన్నారు. తన కూతురు కవితను ఈడీ విచారణ నుండి కాపాడడానికే కెసిఆర్ ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు ఆయన. తెలంగాణ ప్రజల ముందు బిజెపికి, మోడి అమిత్ షా లకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పోరాడుతుందని డ్రామాలు చేస్తూ, తెరవెనక దోస్తీ చేస్తున్నారన్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్.
జగిత్యాల జిల్లాలో ఒక యువతిపై ఎస్ఐ దాడి చేయడాన్ని తప్పుబట్టారు బిఎస్ పి నేత ప్రవీణ్ కుమార్. షీ టీమ్స్ మహిళా పోలీసులు ఎక్కడ పోయిండ్రని, పోలీసులే ఇలా మహిళల పట్ల వివక్ష చూపుతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఆయన. కెసిఆర్ పాలనలో పోలీసులు మహిళల కిచ్చే గౌరవం ఇదేనా అని విమర్శించారు ప్రవీణ్ కుమార్.