రేవంత్ ఢిల్లీ టూర్ పై రాజకీయం

రేవంత్ ఢిల్లీ టూర్ పై రాజకీయం

హైదరాబాద్, నిర్దేశం:
ప్రధాని మోదీని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ  తర్వాత పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.   బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  ఆరోపణ , ప్రత్యారోపణలు సాగుతున్నాయి.  ప్రధాని  ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో భాగమే. సమాఖ్య  విధానంలో ఇది సాధారణమే.  కాని  కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ  అధికారంలో ఉన్నప్పుడు  ప్రధాని, ముఖ్యమంత్రి  భేటిని రాజకీయ కోణంలో చూసే పరిస్థితి ఉంటుంది.  అయితే ఏ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, మోదీని కలిశారు. ప్రధాని మోదీతో భేటి కి ముందు   సీఎం రేవంత్ రెడ్డి  మోదీ పై విరుచుకుపడిన పరిస్థితి.  సాధారణ ఎన్నికల స మయంలోను, ఢిల్లీ శాసన సభ ఎన్నికల సమయంలో  అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రమే   ఓ రేంజ్ లో మోదీని టార్గెట్ చేసేలా విమర్శలు గుప్పించారు.   ఆ తర్వాత అదే రేంజ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని టార్గె చేసేలా గత కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. కుల గణన విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్  రేవంత్ లక్ష్యంగా టార్గెట్ చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. మోదీ అసలు బీసీనే కాదని, లీగల్లీ కన్వర్టడ్ బీసీ అని వాఖ్యానిస్తూ మోదీని అగ్ర వర్ణ నాయకుడిగా అభివర్ణించారు. ఆయన పుట్టింది అగ్రకులంలోనే అంటూ, తాను 2001లో ముఖ్యమంత్రి అయ్యాక బీసీగా తన కులాన్ని మార్చుకున్నారని దుయ్యబట్టారు.బీసీ సర్టిఫికెట్ ఉన్నా, బీసీల పట్ల మోదీకి తీవ్ర వ్యతిరేకత ఉందని  రేవంత్  చెప్పారు.  దేశంలో బీసీ లెక్కలు తీయకుండా మోదీనే అడ్డుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్.   అంతే కాదు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం  లేదని  వివక్ష చూపుతున్నారని  విమర్శించారు. ఇలా రేవంత్ రెడ్డి మోదీని బీసీల వ్యతిరేకిగా అదే రీతిలో తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకిగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి.  రాష్ట్ర మీడియాతో పాటు,  జాతీయ మీడియా కూడా రేవంత్ కామెంట్స్ ను పెద్ద ఎత్తున కవర్ చేయడం విశేషం.6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని  కేంద్ర మంత్రి బండి సంజయ్ గత  ఆరేడు రోజుల క్రితం  సంచలన ప్రకటన చేశారు. క్యాబినెట్ లోని టాప్ ఐదుగురు మంత్రులు మాత్రమే సంతోషంగా ఉన్నారని, వారికి మాత్రమే ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని మిగతా వారంతా అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారు.ఇక  చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో  ఉన్నారని, వారిలో కొద్ది మంది  ఫాం హౌస్ లో ఇటీవలే సమావేశమయ్యారని చెప్పడం ఇవన్నీ చూస్తే తెలంగాణలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు రెకెత్తించేవే.  అదీ కేంద్ర మంత్రిగా  ఉన్న బండి సంజయ్ నోట ఇలాంటి మాటలు రావడం  అంత ఆషా మాషీగా మాట్లాడిన మాటలే కావని, అలాంటి పరిస్థితి ఎంతో కొంత కాంగ్రెస్ సర్కార్ లో  ఉండోచ్చన్న చర్చ సాగుతోంది. అయితే ఇది ఓ మంత్రి పై అసంతృప్తితో   నలుగురైదుగురు ఎమ్మెల్యేలు సమావేశం అయితే  అదేమి పెద్ద విషయం కాదని కాంగ్రెస్ చెబుతున్నా ఇవి  ప్రమాద ఘంటికలేనన్నది స్పష్టం.  ఇలాంటి సంచలన వ్యాఖ్యల అనంతరం  రేవంత్ రెడ్డి ఢిల్లీలో  మోదీని కలవడం కూడా  ఓ ప్రాధాన్యత అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఆరు నెలల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయకర్ కూడా ఈ మధ్యనే మాట్లాడటం విశేషం.  మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయని, ప్రభుత్వం కుప్పకూలుతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.  ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరభావం వల్ల పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో  విశ్వాసం లోపించిందని చెప్పారు.   ఎర్రబెల్లి మాత్రమే కాకుండా, పార్టీ  వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్,   సీనియర్ నేతలు హరీశ్ రావు, కవితలు కూడా పలు వేదికలపై  ఇదే అంశాన్ని ప్రస్తావించడం విశేషం.  ఇక  లెటెస్ట్ గా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చూస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ను బీజేపీనే కాపాడుతుందని చెప్పుకొచ్చారు.  సీఎం రేవంత్ రెడ్డి  స్వతహాగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకుడని,  బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.  ఈ కామెంట్స్ ద్వారా బీజేపీకి రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారన్న అర్థం వచ్చేలా ఉంది.      విపక్షాలతో రాజకీయం ఇలా ఉంటే  ఈ మధ్య కాలంలో అంతర్గతంగా కొంత అసంతృప్తి  కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.  ముఖ్యంగా బీసీ కులగణన తర్వాత ఆ పార్టీలోని బీసీ నేతలు  కొందరు బాహటంగానే రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరగడం,  పార్టీలో సీనియర్ నేతలయిన జీవన్ రెడ్డి,   చిన్నారెడ్డి,  మధుయాష్కీ,  అంజన్ కుమార్ యాదవ్ వంటి వారి అసంతృప్త రాగాలు హస్తం పార్టీలో వినిపించాయి. ఎస్సీ వర్గీకరణపై  మంద కృష్ణ మాదిగ రేవంత్ సర్కార్ పై తమ రిజర్వేషన్ల శాతం తగ్గించాయన్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. మరో వైపు  బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన  గులాబీ ఎమ్మెల్యేలు  అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ,  కోనేరు కోనప్ప,  దానం నాగేందర్ వంటి వాళ్లు ప్రభుత్వ తీరును , హస్తం పార్టీ నేతల తీరును బహిరంగంగానే తప్పుపట్టిన పరిస్థితి.   మరో వైపు  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు సుప్రింకోర్టులో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేజారితే అప్పుడు  ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ, బీఆర్ఎస్ లకు కాంగ్రెస్ సర్కార్ ను కూల్చడం అంత పెద్ద విషయం కాదు. నలుగురైదుగురు అసంతృప్త హస్తం ఎమ్యెల్యేలను టార్గెట్ చేస్తే కాంగ్రెస్  సర్కార్ కూలడం ఖాయం. అయితే  ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అంత సాహసం చేసే పరిస్థితుల్లో లేదు. మరో వైపు  కాంగ్రెస్ కు ప్రధాన శత్రువయిన బీజేపీ పార్టీ  కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసిన చరిత్ర బీజేపీకి ఉంది. తెలంగాణలోఆ పరిస్థిత రాదన్న  గ్యారంటీ ఏం లేదు.  అయితే ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి  ప్రధాని మోదీని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.  మోదీని ప్రసన్నం చేసుకునేందుకే  రేవంత్ ఢిల్లీ పర్యటన సాగిందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు  ప్రచారం ప్రారంభించారు.ప్రధాని మోదీని కలిసేందుకు మరో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు,  అధికార బృందం వెళ్లినా  సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఒంటరిగా ఏం మాట్లాడుకున్నారన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో సాగుతోంది.  సహజంగా రాష్ట్ర సమస్యలపైనే అయితే  మరో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, ఇతర అధికారులు కూడా  సమావేశంలో ఉంటారని, కాని సీఎం ఒక్కడే కలవడం ఏంటన్న ప్రశ్నలు వేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ నేతలు.  ఇది కేవలం రాజకీయ సమావేశమేనని,  మోదీని కలిసి రాజకీయ విషయాలు చర్చించడానికే రాష్ట్ర సమస్యలను సాకుగా తీసుకుని కలిశారన్న  అనుమానాలను అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు లేవదీస్తున్నారు.ప్రధాని మోదీ డైరెక్షన్  లోనే రేవంత్ సర్కార్ సాగుతుందని  ఆ పార్టీ సీనియర్ నేత కవిత సైతం కామెంట్ చేయడం విశేషం.  రాజకీయాల్లో ప్రతీ పరిణామం కీలకమే.   కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్  నేతలు కాకతాళీయంగా రేవంత్ సర్కార్ ను డిఫెన్స్ లోకి నెట్టడానికే  ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పారా… లేక అలాంటి  రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయా అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »