ఆపరేషన్ సింధూర్… ఇంకా ఉంది
కేంద్రానికి ఆల్ పార్టీ మద్దతు
న్యూఢిల్లీ, నిర్దేశం:
పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పటికీ కొనసాగుతోందని, సరిహద్దు వద్ద పరిస్థితి వేగంగా మారుతోందని.. పొరుగు దేశంతో కొనసాగుతున్న వివాదం గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్, భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలపై ఢిల్లీలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించింది. ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ తోపాటు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజుజు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మిథున్ రెడ్డి సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య, తదుపరి పరిణామాలు, దేశ భద్రతా చర్యలను రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ప్రతిపక్షాలకు వివరించారు.ఈ సందర్భంగా రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్, పీఓకేలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టంచేశారు.
ఈ సమావేశంలో, పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, సరిహద్దులో పరిస్థితి ఇంకా అలానే ఉందని రక్షణ మంత్రి నాయకులకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. మే 7న పీఓకే-పాకిస్తాన్లోని పంజాబ్లోని 21 లక్ష్యాలపై జరిగిన ఉగ్రవాద లాంచ్ప్యాడ్లపై సైనిక దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని కూడా ఆయన చెప్పారు.ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారని, ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ వివరించారని, అందరు నాయకులు తమ సూచనలను అందించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
“మనమందరం కలిసి పనిచేస్తున్న సమయంలో నాయకులందరూ పరిణతి ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ కోసం అందరూ సాయుధ దళాలను ప్రశంసించారు.. అభినందించారు .. మేము ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. మాకు కొన్ని సూచనలు కూడా వచ్చాయి… ” అని ఆయన అన్నారు.అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరన్ రిజిజు మాట్లాడుతూ “ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నేటి సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు భారత సైన్యాన్ని అభినందించారు, వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించాయి. వారు ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా దేశం కోసం కేంద్రం నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదం అంశంపై అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం కలిసి ఉందన్నారు.’అన్ని పార్టీల నేతలు రాజకీయాలు చేయకుండా.. దేశాన్ని కాపాడేందుకు, జాతీయ సమగ్రత కోసం దోహదపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, ఉగ్రవాదంపై వారికి ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేశారు.
9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
భారత సైన్యం కేవలం 25 నిమిషాల ఆపరేషన్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 21 గుర్తించిన ఉగ్రవాద శిబిరాల్లో 9 టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. మరో 12 ఉగ్రవాద శిబిరాలు మిగిలి ఉన్నాయి. త్వరలోనే వాటిపై భారత సైన్యం మరోసారి ఆపరేషన్ సిందూర్ చేపడుతుందని చెప్పారు. మూడు సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారుపంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. కొన్నిచోట్ల సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుకు యత్నిస్తుండగా.. భారత సైన్యం వారి ప్రయత్నాలను తిప్పి కొడుతోందని రాజ్ నాథ్ అన్నారు. మరోవైపు భారత్ సరిహద్దు వెంట భద్రత పెంచింది. పాక్ నుంచి వచ్చే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు.
మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు..
భద్రతకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది తాము విన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. దేశభద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని రక్షణ మంత్రి తెలిపారని అన్నారు. ఆ విషయాన్ని తాము గౌరవించామని ఖర్గే వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పామని.. తెలిపారు. అఖిల పక్షానికి ప్రధాని రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఖర్గే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిని విమర్శించడం లేదన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వానికి అందరూ మద్దతు ప్రకటించారని తెలిపారు.పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన TRF సంస్థకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తాను ప్రభుత్వానికి ఈ సూచన చేశానని అసద్ తెలిపారు.