ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం

ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం
మీడియాకు నో ఎంట్రీ…

న్యూఢిల్లీ మే 4: ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో పూజలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమయానికి సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు.

11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, క్యాంటీన్‌ను నిర్మించారు. 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లు నిర్మించారు. సూట్ రూమ్‌లో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.

మీడియాకు నో ఎంట్రీ…
కాగా.. ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకు బీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. అధికారుల ఆదేశాల మేరకు మీడియాను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించివేశారు. పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో కూడా మీడియా వాళ్ళు ఎవరు ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని… అందుకోసమే మీడియాకు నో ఎంట్రీ అని ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది. ఈ ఆంక్షలపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!