సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
నిర్దేశం, హైదరాబాద్ :
రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు.
సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410,11,12) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందిచారు.
అనంతరం అటవీ శాఖ కార్యక్రలాపాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు.
ప్రస్తుతం ఐదు లక్షలుగా ఉన్న పరిహారం పది లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయి. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైల్ పై కూడా మంత్రి సంతకం చేశారు.