బీడీ పింఛన్ పుట్టించిన కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలి..
: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటా ప్రచారం
నిర్దేశం, బాల్కొండ :
దళితబంధు పథకం పవిత్రమైనదని, ఇలాంటి ఆలోచన దేశంలో ఇంత వరకు ఎవరూ చేయలేదని, దశల వారీగా దళితబంధు లక్ష్యం పూర్తవుతుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బీఆరెస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నాలుగేండ్లలో బాల్కొండ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు అందించి తీరుతామన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం కిసాన్నగర్, ఇత్వార్పేట్, జలాల్పూర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళిత కుటుంబాలపై కేసీఆర్కు ఉన్న ప్రేమకు దళితబంధు నిదర్శనమన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, 18 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ దళితబంధు లాంటి పథకాన్ని ఎందుకు తేలేదని ప్రశ్నించారు. రుణమాఫీ సంపూర్ణంగా అమలవుతుందని, ప్రతి ఒక్కరికీ రుణమాఫీ జరిగి తీరుతుందని స్పష్టం చేవారు. దళితబంధు, రుణమాఫీపై విపక్షాలు చేసే దుష్ర్పచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. దుష్ర్పచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరోసారి మట్టికొట్టుకుపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో లేవన్నారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న కృషి రైతుల అనుభవంలో ఉన్నందున ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఎక్కువగా రైతుల మీదే ఉందన్నారు మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి.