కేటీఆర్ టార్గెట్గా కవిత
హైదరాబాద్, నిర్దేశం:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా సంచలం సృష్టిస్తున్నాయి. పార్టీలోని అంతర్గత సమస్యలను మీడియాతో పంచుకోవడంతో, ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్నట్లు అర్థం అవుతోంది. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం ఆ గులాబీ పార్టీలో పాతుకుపోయిన విభేదాలు, నాయకత్వ సంక్షోభాన్ని చూపించేలా ఉన్నాయితనపై కుట్రలు జరుగుతున్నాయంటూ మాట్లాడిన కవిత పార్టీపై జరుగుతున్న మరో కుట్రను బహిర్గతం చేశారు. బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేందుకు కొందరు పార్టీ అగ్రనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర తాను జైలుకు వెళ్లినప్పటి నుంచి మొదలైందని వివరించారు. జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినా తన మాట వినలేదని వాపోయారు. అయితే ఇక రానున్న రోజుల్లో పార్టీ మనుగడ కష్టం అన్న రీతిలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీ కార్యకర్తలు, నేతలను షాక్కు గురి చేస్తున్నాయి. అంతే కాకుండా తాను ఈ కుట్రలకు అడ్డుపడుతు న్నందుకే తనను బయటకు పంపే కుట్రలు చేస్తున్నారన్నట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి.కేసీఆర్కు తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో వెలికి తీయమంటే తనపై దుష్ప్రచారానికి దిగారని ఆగ్రం వ్యక్తం చేశారు కవిత. లీకు వీరులు పట్టుకోమంటే, గ్రీకు వీరులు తనపై దండెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు నాయకత్వ స్థానంలో ఉన్న కొందరు నేతలు తనను పార్టీలో బలిపశువును చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న చర్చకు దారి తీస్తోంది. తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వచ్చిన తప్పుడు వార్తలను ఎందుకు పార్టీ ఖండించడం లేదని ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తనను పార్టీలో ఒంటరి చేస్తున్నారన్న భావన వ్యక్తం చేసేలా ఉంది. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారన్న కవిత తన జోలికి వస్తే సహించనని హెచ్చరికలు చేశారు. ఈ మాటలు టీం కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారంపైనే అన్నది మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.పార్టీలో అందరూ
సమానమే అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కవిత బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని స్పష్టంగా మీడియా ముందు చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పార్టీలో నెంబర్ వన్ కేసీఆర్, నెంబర్ టూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అయితే తాను కేసీఆర్ నాయకత్వం తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ అధినేతకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కు కట్టబెట్టారు. అయితే తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెంబర్ టూగా ఉంటున్న కేటీఆర్ను ఉద్దేశించినవే అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇది ఓ రకంగా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టినట్లేనన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో కేటీఆర్ స్థానాన్ని, ఆయన నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న స్పష్టతను కల్వకుంట్ల కవిత ఈ మీడియా చిట్ చాట్ ద్వారా ఇచ్చినట్లైంది.
కేసీఆర్ను తామే నడిపిస్తున్నామని చెప్పుకునే వారిని కవిత వదిలిపెట్టలేదు. కేసీఆర్కు నోటీసులు వస్తే సైలంట్గా ఉన్న గులాబీ నేతలు, మరో నేతకు అంటూ కేటీఆర్ ప్రస్తావన తెచ్చారు. కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇస్తే మాత్రం ఎందుకు హంగామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ను మించిపోయినట్లు సదరు నేతల ప్రవర్తన ఉందని చెబుతూనే ఈ విషయంలో కేసీఆర్
మౌనాన్ని కూడా ప్రశ్నించినట్లు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కోవర్టులు ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆ కోవర్టులను ఎందుకు పార్టీ పక్కకు పెట్టడం లేదని కౌంటర్ క్వశ్చన్ వేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో మరింత సంచలనంగా మారాయి. కేసీఆర్ తాను సైలంట్గా ఉండిపోయి, కవిత విమర్శిస్తున్న నేతల చేతుల్లో పార్టీ మొత్తాన్ని పెట్టారా అన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది.”కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ” అని కవిత వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు” అని ఆమె తేల్చిచెప్పారు. తనపై, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. “నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు, తనపై జరుగుతున్న కుట్ర పార్టీలోని అత్యంత సన్నిహితుల లేదా ఇంట్లోని వారితోనే మొదలైనట్లు ఆమె మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఆమె కుటుంబ సభ్యులే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయం ఆమె మాటల్లో కనిపిస్తోంది. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా ఆమె ఆరోపించడం గమనార్హం.
ఇది కుటుంబంలోనే తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పినట్లు ఆమె భావిస్తున్నారని తెలియజేస్తుంది. పార్టీలో తన స్థాయి, ప్రాధాన్యత తగ్గించడానికి అంతర్గతంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పరోక్షంగా ఆక్షేపించారు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులు తాను తెలంగాణ జాగృతి తరపున చేస్తున్నానని కవిత మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. “జాగృతి పని చేస్తోంది, బీఆర్ఎస్ ఏం చేయడం లేదు” అని మీడియాతో ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవిగా చెప్పాలి. పార్టీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని, ఆ లోటును జాగృతి భర్తీ చేస్తోందని ఆమె చెప్పకనే చెబుతున్నారు. ఇది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ జాగృతిని నిలబెట్టాలనే కవిత ఆలోచనను స్పష్టం చేస్తోందా అన్న ప్రశ్నను సర్వత్రా రేకెత్తిస్తోంది. ఇదే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవడమే కాకుండా, ఒక వేళ తనను పక్కన పెడితే తనకు ప్రత్యామ్నాయ వేదిక ఉందని చెప్పే ప్రయత్నంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరో కోణంలో చూస్తే పార్టీలో తాను చేయాల్సన పనులు చేయనీనందుకే , జాగృతి ద్వారా పని చేస్తున్నానని చెబుతోందా అన్న ప్రశ్నలు తలెత్తేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే పార్టీలోతనను జీరో చేసే కుట్ర జరుగుతుందని చెబుతోందని అర్థం చేసుకోవచ్చు.తాను కాంగ్రెస్ పార్టీతో ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తానని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించడమే కాకుండా పార్టీలో జరుగుతున్న పరిణాలను కవిత తన చిట్ చాట్ ద్వారా బహిర్గతం చేశారు. తనను టార్గెట్ చేస్తోంది కుటుంబ సభ్యులే అని అది కేటీఆరే అని స్పష్టత ఇచ్చేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఈ పరిణామాలు చివరకు ఎలా దారి తీస్తాయో మాత్రం వేచి చూడాల్సిందే.