స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు నమోదుకు అవకాశం
హైదరాబాద్, నిర్దేశం:
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఎప్రిల్ 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి ఓటుగా నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి1 తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సదరు తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత లభించేది. సదరు విధానానికి స్వస్తి పలికారు. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. జాబితాలో లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తిస్థాయిలో సవరించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.ఏప్రిల్ లో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి యంత్రాంగం సిద్ధమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు స్వీకరించడమే కాకుండా నమోదుకు సంబంధించిన నిబంధనలు వివరించారు.
ఈ క్రమంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు కొత్త ఓటర్లను నమోదు చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామం, వార్డు, డివిజన్ స్థాయిలో ఉండే ఆయా పార్టీల నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఓట్ల నమోదుపై దృష్టి సారిస్తున్నారు.అరచేతిలోనే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసు కోవడం, తప్పులను సరిచేసుకోవడానికి, ఓటు హక్కును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవడానికి, జాబితాలో రెండు ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగింపు, ఇతర అంశాలకు సంబంధించి వేర్వేరుగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి అందులో పొందుపర్చాల్సిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు ఏఈఆర్వోకు వద్దకు వెళ్తాయి. పరిశీలించి ఆమోదిస్తారు.వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో https: voters. eci. gov. in యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా లేదా చూసుకునే అవకాశం కల్పించారు.ఓటరు గుర్తింపు కార్డు కావాలనుకునేవారు వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో ఈ-ఎపిక్ కార్డు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం అయితే ఓటీపీ వస్తుంది. లేకుంటే కాదు. ఫారం-8 ద్వారా ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏయే ఫారం.. ఎందుకంటే…
ఫారం-6: కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఈ దరఖాస్తును పూరించాలి. ఒక ఫొటో, వయసు నిర్ధారణ పత్రం(ఎస్సెస్సీ మెమో), చిరునామా ధ్రువీకరణ ఉండే కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్ను వంటి వాటిని జతచేయాలి.
ఫారం-6ఏ: విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఫార్మాట్ రూపొందించారు. ఎన్నారైలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 నుంచి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఫారం-7: ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఈ ఫారంను పూరించాలి. ఓటరు మరణించినా, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డా వారిని జాబితా నుంచి తొలగించాలని ఈ పారం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ఫారం-8ఏ: పట్టణాల్లో చాలామంది ఒక కాలనీ నుంచి మరో కాలనీకి మారుతుంటారు. ఈ క్రమంలో ఓటు వేసేటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం ఈ ఫారం ఉప యోగపడుతుంది. ఒక పోలింగ్ బూత్ నుంచి మరో సమీప పోలింగ్ బూత్ కు మారేందుకు దరఖాస్తు చేయాలి.ఇక ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు. అంతేకాకుండా ఇంటర్ నెట్ నుంచి ఈమెయిల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 5,30337 మంది పురుషులు, 5.52.358 మంది మహిళలు, 61 ట్రాన్స్ జెండర్స్ మొత్తం 10,82,751 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు జాబితాలో మహిళలే ఎక్కువగా నమోదయ్యారు. ఈసారి సైతం వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. యువత.. ఓటు నమోదుకు ముందుకు రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.