దాడికి సిద్ధమవుతున్న భారత్
– ఉగ్రవాదానికి గట్టి దెబ్బ ఇవ్వాల్సిందే
– వరుస సమీక్షల్లో ప్రధాని మోదీ
నిర్దేశం, న్యూఢిల్లీః
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ.. వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. దేశ భద్రత స్థితిగతులపై మోదీకి బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే.. 48 గంటల్లో మోదీ-దోవల్ భేటీ కావడం ఇది రెండోసారి.. అయితే.. రేపు దేశవ్యాప్త మాక్డ్రిల్కి ముందు వీరిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానమంత్రిని కలిశారు.
అంతకుముందు, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా మోదీతో సమావేశం నిర్వహించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. పహల్గామ్ ఉగ్రదాడులకు పాల్పడినవారిని, వారికి మద్దతిచ్చేవారిని ఊహకందని రీతిలో శిక్షిస్తామని ప్రకటించిన ప్రధాని అందుకు అనుగుణంగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ భద్రతపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది మరణించారు. తర్వాతిరోజు, అంటే ఏప్రిల్ 23నాడు సౌదీ టూర్ను మధ్యలోనే ముగించుకుని, ఢిల్లీకి వచ్చిన మోదీ, అదేరోజున అజిత్ దోవల్ను పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో మోదీ-దోవల్ భేటీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రేపటి దేశవ్యాప్త మాక్డ్రిల్ తర్వాత ఏం జరుగుతోందన్నదే ఆసక్తిగా మారిందిపహల్గామ్ దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకునే సమయం, విధానం, స్వభావాన్ని నిర్ణయించుకోవడానికి సైన్యానికి ‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’ను మోదీ ఇటీవల ఇచ్చారు.
‘ఉగ్రవాదానికి గట్టి దెబ్బ’ ఇవ్వాలనే దేశం దృఢ సంకల్పాన్ని ఆయన నొక్కి చెప్పారు. సైనిక సంసిద్ధతతో పాటు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పౌర సంసిద్ధతను పెంచుతోంది. మే 7, బుధవారం, అన్ని రాష్ట్రాలుచ, కేంద్రపాలిత ప్రాంతాలు 244 పౌర రక్షణ జిల్లాలను కలుపుకుని విస్తృతమైన మాక్ డ్రిల్లను నిర్వహిస్తాయి. ఈ కసరత్తులలో వైమానిక దాడి సైరన్లను మోగించడం, డ్రిల్గా ప్రజలను తరలించడం, భారత వైమానిక దళంతో కమ్యూనికేషన్ సంబంధాలను పరీక్షించడం, నియంత్రణ గదులను సమీకరించడం వంటివి ఉంటాయి.