భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా…
అనాదిగా ఆచారం, సాంప్రదాయం పేరిట జరుగుతున్న తంతు అంతా ఇదే. భర్త చనిపోగానే స్త్రీలకు ఇదొక మానసిక హింస. అసలే భర్త దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో ఈ ఆటవిక తంతులు మరింతగా కుంగదీస్తాయి. భార్య చనిపోతే మగవారికి ఇలాంటి సాంప్రదాయాలు ఏవీ ఉండవు.
ఈ వివక్ష నుండి మన సమాజం బయట పడాలి. యే భర్త కూడా తన భార్య ఈరకంగా బోసిగా ఉండాలని కోరుకోడు, తాను ఉన్నా లేకున్నా కూడా ఈరోజు నాగేష్ బాబు సంస్మరణ సభకు వెళ్లి నప్పుడు ఒక సంఘటన జరిగింది. నాతోపాటు గుత్తా జ్యోత్స్న గారు, కృష్ణ చంద్, అలివేలు మంగ, బి బి షా నాగేష్ బాబు భార్య సంతోష ను పరామర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడ సంతోష ఎంతో దుఃఖంలో ఉన్నది.
పైగా బొట్టు గాజులు ఏవీ లేవు. అందరూ ఆమెను ధైర్యంగా ఉండాలని నచ్చజెప్పాము. సాంప్రదాయాల పేరు తో ఆమెను ఇబ్బంది పెట్టొద్దని అక్కడున్న వారితో జ్యోత్స్న గారు హితవు పలికారు. అంతేకాకుండా అక్కడున్న వారితో బొట్టు గాజులు తెప్పించి సంతోష ను అలంకరించారు. అక్కడున్న వారందరూ దీనికి అంగీకరించారు. ఇది ముందుగా అనుకున్నదేమీ కాదు. మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. చొరవ చూపి ఒక మంచి పని చేసిన జ్యోత్స్న గారికి మంగ కు ప్రత్యేక అభినందనలు.
– వహీద్