ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.
కులాలు, మతాలు వేరైనా వారి మనసులు కలిశాయి. నీకు నేను నాకు నీవు అంటూ ప్రేమించుకున్నారు.
ఆ ప్రేమికుల ప్రేమను పెద్దలు పెళ్లికి అంగీకరించలేరు. రెండు నెలల క్రితం కుటుంభీకులు అమ్మాయి పెళ్లి చేశారు.
ప్రేమికుల రోజు పుట్టింటికి వచ్చిన ఆ యువతి తన ప్రేమికుడితో కలిసి మాయమైంది. తీరా చూస్తే ప్రేమికుల రోజు ఆ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : ప్రేమికుల రోజు అదశ్యమైన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నార్సింగి చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
మతాలు వేరుకావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ క్రమంలో కల్పనకు వేరే వ్యక్తితో రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. ఇటీవల పుట్టింటికి వచ్చిన కల్పన.. నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రేమికుల దినోత్సవం రోజు తమ కూతురు కనిపించడం లేదని కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ చెప్పులు, బైకులు కనిపించాయి. దీంతో వీళ్లిద్దరూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. రెండు రోజులు చెరువులో గాలించగా ఇవాళ ప్రేమికుల మృతదేహాలు లభించాయి.