ఎన్నికల ముందు ఈడీ వస్తది : కవిత
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కి పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారిస్తారని గుర్తు చేశారు. కుదరక పోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా విచారిస్తారని తెలిపారు. కానీ కావాలనే తనను ఢిల్లీకి పిలిచారని..2023, మార్చి11వ తేదీన ఉదయం 11న ఈడీ విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీని ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి మోడీ కంటే ముందు ఈడీ వస్తోందన్నారు. నవంబర్, డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని.. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని చెప్పారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందన్నారు.