సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
– పుష్కరాలకు తరలి వస్తున్న భక్తులు
– జనసంద్రంగా మారింది కాళేశ్వరం
– త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం
– త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం
నిర్దేశం, హైదరాబాద్ః
త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సరస్వతి పుష్కరాల్లో ఐదవ రోజు సోమవారం ఉదయం నుండే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్త జనం కాళేశ్వరం క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం ట్రాఫిక్ జామ్ కావడంతో ఎదురైన ఇబ్బందులు తిరిగి పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాహనాల రాకపోకలు సాగాయి.
సైకత లింగాలు
సరస్వతి అంతర్వాహిని నది పుష్కరాలను పురస్కరించుకని భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మ ఒడిలో జంగమయ్యను ఆరాధిస్తున్నారు. సైకత లింగాలను తయారు చేసుకున్న భక్తులు శివ నామస్మరణలో చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. నది తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించిన తరువాత నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించే ఆనవాయితీని పాటిస్తారు. అనంతరం త్రివేణి సంగమాన్ని పూజించి దీపారాధన చేసి గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ తరువాత సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకాశిల సరస్వతి మాతను, శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని, శుభానంద దేవిని, సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతున్న త్రివేణి సంగమ తీరం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.
మొంటెల వాయినం
పుష్కరుడు సంచరించే వేళ ముత్తయిదలు మొంటెల వాయినం మొక్కులు తీర్చుకుంటున్నారు. సుభాషిణీలకు సాంప్రాదాయ బద్దమైన ఆచారంలో భాగంగా మొంటెల వాయినాలు ఇస్తూ దీర్ఘ సుమంగలిగా ఉండేలా దీవెనలు అందుకుంటున్నారు.
ఏరియల్ సర్వే
త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గగనంలో సంచరిస్తూ నది తీరం, వాహనాలు రాకపోకలతో పాటు ఏర్పాట్లు తదితర సేవలను పర్యవేక్షించారు.