ఇదేం జర్నలిజం…?
జైలులో ‘బాబు’ను కాటేస్తున్న దోమల వెనుక కుట్రా..!
అప్పుడెప్పుడో తాను రాసిన కథకు ‘‘జర్నలిస్ట్ ను పెంపుడు కుక్కతో పోల్చాడు’’ ‘సాక్షి’ ఎడిటర్ గా కొనసాగిన స్వర్గీయ పతంజలి గారు. నిజమే.. జర్నలిజం అంగట్లో సరుకులా హీనంగా మారింది. ఆ పెద్దాయన రాసిన కథలోని పాత్రలో జర్నలిస్ట్ గురించి చర్చిస్తుంటారు. అప్పట్లో.. దుబాయ్ లో సినీహీరోయిన్ శ్రీదేవి బాత్ రూమ్ లో ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ‘‘బాత్ టబ్’’లో రిపోర్టర్ పడుకుని రిపోర్టింగ్ చేస్తుంటాడు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిర్దేశం, హైదరాబాద్ :
ఇగో.. ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలు గురించి ఒక రిపోర్టర్ టీవీ న్యూస్ లో లైవ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు.
కానీ… ఆ జైలు లో నారా చంద్రబాబు ఎలా ఉన్నాడో ఓ టీవీ న్యూస్ రిపోర్టర్ తనదైన స్టైల్ లో చెబుతుంటే మీరు ఒక్క క్షణం ఆశ్చర్య పోవడం ఖాయం.. రవి గాంచని చోటుకు కవి గాంచును అని కవిత్వం… కానీ… రాజమండ్రి జైల్ గోడల మధ్య నారా చంద్రబాబు నాయుడు దోమలతో ఎలా బాధ పడుతున్నాడో.. ఆ దోమలు బాబును కుట్టడం వెనుక కుట్ర దాగిందని వివరించారు ఆ గ్రేట్ రిపోర్టర్ గారు. దోమలు బాబును కాటేయడం వెనుక జగన్ ఉన్నాడని పరోక్షంగా ఆ రిపోర్టర్ వివరించారు. ఆ రిపోర్టర్ మాట్లాడిన తీరును చూసిన సీనియర్ జర్నలిస్ట్ బుద్ద మురళి గారు తన ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా రాసిన పోస్ట్ ఇదే..
ఎడిటర్ : ఏమయ్యా రిపోర్టర్ నిన్న దోమలతో బాబుకు స్లో పాయిజన్ అని వార్త ఇచ్చావు … ఈ రోజు దానికి ఫాలో అప్ వార్త ఇచ్చేది లేదా ?
రిపోర్టర్ : ఏమివ్వాలి సార్ …?
ఎడిటర్ : అన్నీ చెప్పాలా ? పులివెందుల నుంచి జగన్ వెయ్యి దోమలను పంపాడు … వాటికి స్లో పాయిజన్ ఇచ్చాడు … బాబును కుట్టమని చెప్పి పంపించారు … కానీ బాబు లాంటి నాయకుడు ఈ ప్రపంచానికి అవసరం అని మేమే కుట్ట కుండా వెనక్కి వచ్చాము అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక దోమ చెప్పిందని స్టోరీ చేయి … ఈ విషయాన్నీ కేంద్ర నిఘా వర్గాల్లోని పేరు చెప్పడానికి ఇష్టపడని అత్యున్నత అధికారి నిర్ధారించారు అని స్టోరీ చెయ్ ….
- బుద్ధ మురళి గారి పేస్ బుక్ సౌజన్యంతో…