బూతు ఎస్సై పై అడిషనల్ సీపీకి ఫిర్యాదు
– అయినా చర్యలు నిల్
నిర్దేశం, నిజామాబాద్ :
ఖాకీ డ్రెస్ వేసుకుని ఆర్మూర్ లోని ముగ్గురు జర్నలిస్టులను అసభ్య పదాజాలంతో దూషించి, చంపుతానని బెదిరించిన జగిత్యాల సిసిఎస్ ఎస్సై రవీందర్ శెట్టి పై ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేరు. విలేకరులను చంపుతానని బెదిరించిన బూతు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా టీయుడబ్లూజే నాయకులు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ అదనపు సిపి కోటేశ్వరరావుకు టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, జిల్లా కోశాధికారి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్, గోవింద్ రాజు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్, ఆర్మూర్ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినా ఆ ఎస్సైకి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్ వెనకాల చందూరి పద్మావతి అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని ముగ్గురు జర్నలిస్టులు పరిశీలించి, వివరణ అడగడానికి వెళ్లగా ఇంటి నిర్మాణ దారులు దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. అనుమతికి విరుద్ధంగా నిర్మించిన భవనం గురించి మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేయగా ఆయన పరిశీలించి వాస్తవమని తెలుసుకొని నోటీసులు జారీ చేశారన్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని జగిత్యాల సిసిఎస్ ఎస్సై రవీందర్ శెట్టి బూతు మాటలు తిట్టి దూషించాడని వివరించారు.
అంతేకాకుండా జర్నలిస్టులను కాల్చిపడేస్తాను అని తీవ్రంగా బెదిరించాడన్నారని విలేకరులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై రవీందర్ శెట్టిపై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదని, పైగా తమపై కేసులు నమోదు చేస్తామని ఆర్మూర్ పోలీసు అధికారులు స్పష్టం చేస్తూ ఎస్సైని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సీపీకి, అదనపు సీపీకి వివరించారు. ఎస్సై బూతుపదాలతో దూషించిన రికార్డింగ్ ను సీపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి జర్నలిస్టులను తీవ్రంగా దూషించి, చంపుతానని బెదిరించిన జగిత్యాల ఎస్ఐ రవీందర్ శెట్టిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు. ఇందులో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు పార్ధేం సంజీవ్, జిల్లా సంయుక్త కార్యదర్శి అజీమ్, ఆర్మూర్ జర్నలిస్టులు నరేందర్, గోలి పురుషోత్తం, గణేష్ గౌడ్, మురళి, చరణ్ గౌడ్, శ్రావణ్, మహిపాల్, రాజేందర్, ప్రసాద్, మ్యాకల దినేష్, బారడ్ గణేష్, పింజ సుదర్శన్, మహేష్, సాయి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.