సరిహద్దుల్లో సివిల్ మాక్ డ్రిల్
న్యూఢిల్లీ, నిర్దేశం:
కాల్పుల విరమణ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయి. కానీ పాక్ కుయుక్తులను తిప్పి కొట్టేందుకు భారత్ రెడీగా ఉంది. ఇటీవల ఓసారి సివిల్ మాక్ డ్రిల్ సైతం చేపట్టి పౌరులకు అవగాహనా కల్పించింది కేంద్రం. మరోసారి సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చేపట్టినట్లు దేశ వ్యాప్తంగా కాకుండా కేవలం పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న 4 రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేస్తారు.మే 29న (గురువారం నాడు) జమ్మూ కాశ్మీర్ల, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో గురువారం సాయంత్రం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముందు భారత్లో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో, ఏపీలోని విశాఖపట్నంలో, తెలంగాణలోని హైదరాబాద్లోనూ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. పాక్ సైన్యం దాడులు ఓ వైపు, ఉగ్రవాదుల కుట్రలు మరోవైపు భారత్కు ప్రమాదంగా మారుతున్నాయి. దాంతో ప్రజలను ఎప్పటికప్పుడూ సైన్యం చేస్తున్న సన్నద్ధత, పౌరులకు అవగాహన కల్పించడం కోసం పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో మే 29న సాయంత్రం మాక్ డ్రిల్ చేపడతారు.
ఉగ్రవాదంపై పోరుకు ఆపరేషన్ సిందూర్
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఓ నేపాలీ సహా 26 మంది అయామకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారణంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టింది. అంతా ప్లాన్ చేసుకుని మే 6, 7 తేదీలో రాత్రి భారత్ పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. దానికి ముందే దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో చాలా వరకు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలో, ముప్పునకు గురయ్యే పరిస్థితుల్లో ఎలా బయట పడాలో పౌరులకు అవగాహన కల్పించారు.శత్రు దాడుల సమయంలో, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌరులను సంసిద్ధం చేయడం. వారికి అవగాహనా కల్పించడంతో పాటు అత్యవసర సమయంలో స్పందించాల్సిన పద్ధతులపై అలర్ట్ చేయడం ఈ సివిల్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో ఎయిర్ సైరన్ల మోత వినిపిస్తుంది, స్థానిక అత్యవసర సేవలు, సమన్వయంతో స్పందించడం వంటివి ఉంటాయి. 1971లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కానీ 1999లో కీలకమైన కార్గిల్ యుద్ధం సమయంలో పౌర రక్షణ డ్రిల్స్ నిర్వహించలేదు. ఇటీవల మే 7వ తేదీన సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించి పౌరులకు వీటిపై అవగాహనా కల్పించడంతో పాటు యుద్ధ వాతావరణం సమయంలో పాటించాల్సినవి తెలిసేలా చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు