6 ఏండ్ల లోపు వారిని అంగన్వాడీల్లో చేర్పించాలి
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నిర్దేశం:
ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో చదువుతోపాటు ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారని అన్నారు. నూతన సిలబస్ తో, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీల్లో బోధిస్తున్నామని అన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీల్లో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. పిల్లలందరిని అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పర్లపెల్లి గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. ఇదివరకే ఈ గ్రామంలో రెండు సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వచ్చే నెలలో మరో సారి క్యాంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు అందజేసే ఈ క్యాంపును నూరు శాతం మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు కూడా ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళ పరీక్ష ద్వారా ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, సేవల గురించి శుక్రవారం సభలో తెలియజేస్తామని అన్నారు. మహిళలు తమ సమస్యలను ఈ సభలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. శుక్రవారం సభ ద్వారా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళల్లో రక్తహీనతను నివారించగలుగుతున్నామని అన్నారు.
అనంతరం గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు.