బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది : మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
ఖమ్మం: బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బుధవారం ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ..
చారిత్రక ఖమ్మం నగరం.. జనసంద్రంగా మారింది. ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్య వంతులు. ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అంటే.. కేంద్రంలోని బీజేపీ రోజులు లెక్కపెడుతోందన్నమాట. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. విపక్ష నేతలను కేసులతో ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అవి బీజేపీ సంస్థల్లాగా మారిపోయాయి.
ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందన్నారు అఖిలేష్ యాదవ్. తెలంగాణ పథకాల్ని కేంద్రం కాపీ కొడుతోందని, కలిసి పని చేస్తే దేశానికి కొత్త మార్గదర్శకత్వం దొరుకుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు. కేసీఆర్ పని ఎక్కువ చేస్తూ.. ప్రచారం తక్కువగా చేసుకుంటారని కొనియాడారు. బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం దక్షిణాది నుంచి.. అది తెలంగాణ నుంచే ప్రారంభమని అఖిలేష్ ప్రకటించారు.