మీడియా కవరేజ్ పై కేంద్రం సూచన..
– రక్షణపరంగా ప్రభుత్వ చర్యలపై లైవ్ లు ఇవ్వొద్దు….
పాకిస్తాన్ – ఇండియా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో మోదీ ప్రభుత్వం జర్నలిస్టులకు పలు సూచనలు చేసింది. అదే టైంలో సోషల్ మీడియా యూజర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణపరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటుంది. వాటిని కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని తెలిపింది. మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ““జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ ఫాంలు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం (Live Coverage) చేయకూడదు.’ అని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది.