ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆగ్రహం
– కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతుల దహనం
– పాపం మానవతరాయ్.. మళ్లీ ఆందోళన వైపే..
పాపం మానవతరాయ్.. అతను మొన్నటి వరకు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసారు. విద్యార్థి సంఘం నాయకులుగాయప్రభుత్వ నిర్బంధంను తట్టుకుని అలుపెరుగని పోరాటం చేసారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ ఎస్ లో చేరడంతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ నేతగా నిరుద్యోగుల గురించి ఆందోళన చేస్తున్నారు. కొందరి రాజకీయ భవిష్యత్ గిట్లనే ఉంటుంది కదూ..
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు నెలల్లో రూ.4000 నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు.నిన్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల్లో ఎక్కడా హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ నిరుద్యోగ భృతి గురించి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారని, ప్రియాంక గాంధీ కూడా ఓ సభలో వ్యాఖ్యానించారని నిరుద్యోగులు గుర్తు చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.