అభ్యర్థిగా నోటా.. ఏకగ్రీవం రద్దు
– ఏకగ్రీవాలకు ఇక చెక్ పడ్డట్టే
– స్థానిక సంస్థల్లో ప్రయోగానికి సిద్ధం
– కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి తీవ్ర రచ్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు అన్ని రాజకీయ పక్షాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ఏకగ్రీవాలు ఎక్కువయ్యేలా కృషి చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం ఇటీవల చేశారు.
అయితే ఏకగ్రీవాలపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దనేది సుప్రీం భావన. అందుకే ఒకే ఒక్కరు నామినేషన్ వేశారనే కారణంతో ఏకగ్రీవం చేసుకోవడం ఇకపై కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అభ్యర్థిగా నోటాను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం సీరియస్గా పరిశీలిస్తోంది. అదే జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు ఏకగ్రీవం చేసుకోడానికి వీలయ్యే పరిస్థితి వుండదు.
ఒకవేళ ఎవర్నీ నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నా, నోటా రూపంలో స్వచ్ఛందంగా ఒక అభ్యర్థిని ఎన్నికల సంఘమే నిలబెట్టినట్టు అవుతుంది. అప్పుడు ఎన్నిక తప్పనిసరి. అందువల్ల రాజకీయ పార్టీలు ప్రలోభపెట్టో, లేక బెదిరించో ఏకగ్రీవం చేసుకోవాలని అనుకున్నా, ఇకపై కుదరకపోవచ్చు. ఇవన్నీ కూడా నోటా అభ్యర్థి అయినప్పుడే అమలవుతాయని గ్రహించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటా సంస్కరణను ఎన్నికల సంఘం తీసుకొస్తే మంచి పరిణామమే.