భారతదేశ 14వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఒక ప్రేరణ. కష్టాలు ఎన్నున్నా కృషి, నిజాయితీ, అంకితభావం ఉంటే ఏ వ్యక్తికైనా తన గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయని నిరూపించారు. సాధారణమైన నేపథ్యం నుండి ప్రారంభమైంది ఆయన జీవితం. కానీ, ఆయన నాయకత్వం దేవంలో ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చింది. మన్మోహన్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత రాజకీయాల్లో అలాగే ఆర్థిక వ్యవస్థలో ఆయనను హీరోగా నిలబెట్టాయి. అంతటి మహా వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రారంభం, విద్య
మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న పంజాబ్లోని గాహ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. అయితే దేశ విభజనలో అది పాకిస్థాన్లో కలిసింది. చిన్న పల్లెటూరిలో పుట్టినప్పటికీ, ఆయన కుటుంబం చదువుకు ప్రాధాన్యతనిచ్చింది. మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. అనంతరం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్, అలాగే ఆక్స్ఫర్డ్ నుంచి డీఫిల్ చేశారు. కేంబ్రిడ్జ్లో ఆయన గైడర్ ప్రఖ్యాత బ్రిటీష్ ఆర్థికవేత్త జోన్ రాబిన్సన్. జోన్ సూచనలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యమైన విధానాలకు పునాది వేశాయి. స్థూల శాస్త్రంలో (పబ్లిక్ ఎకనామిక్స్) ముఖ్యమైనవిగా నిలిచాయి. ఆర్థిక కష్టాల్లో చదువుకున్న మన్మోహన్.. స్కాలర్ షిప్ చాలక.. తండ్రి మీద ఆధారపడవలసి వచ్చింది. ఊరిలో ఉండగా కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నాడని, దాని వల్ల తన కళ్ళు దెబ్బతిన్నాయని ఆయన స్వయంగా చాలాసార్లు చెప్పారు.
ఆర్థిక రంగంలో, ప్రభుత్వ సేవలో అడుగులు
మన్మోహన్ సింగ్ 1971లో ప్రభుత్వంలో ప్రవేశించారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో అనేక ముఖ్యమైన పదవుల్లో పనిచేసేందుకు మన్మోహన్ సింగ్కు అవకాశం కల్పించారు. ఆ సమయంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. ఆయన నైపుణ్యం ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఆరవ పంచవర్ష ప్రణాళికను అమలు చేయడం ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సవాలుగా మారింది. సింగ్కు ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు. అయితే, మన్మోహన్ సింగ్ ఈ పదవిలో ఉన్న ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి ఆందోళన చెందారు. ఎందుకంటే అతను ఈ పదవి ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేరు. అయితే, ఇందిరాగాంధీ ఆయన పక్షం వహించి ఆయనకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు ఒప్పుకున్నారు. మన్మోహన్ సమర్థతను, నిజాయితీని ఇందిరాగాంధీ పూర్తిగా అర్థం చేసుకున్నారనడానికి ఇది ఒక నిదర్శనం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్
1982లో ఇందిరా గాంధీ మన్మోహన్ సింగ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమించారు. ఈ పదవిలో ఉండగానే పలు వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం, ఆర్బిఐ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో పెద్ద వివాదం నెలకొంది. కోర్టు ఆయనకు అనుకూలంగా లేకపోయినా, చివరికి ఆయన వాదనలే గెలిచాయి. బీసీసీఐ వివాదంలో కూడా మన్మోహన్ కు ఇందిరా అండగా నిలిచారు.
రాజకీయ సంక్షోభం, కొత్త అవకాశాలు
1980ల చివరలో భారతదేశంలో రాజకీయ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ను తిరిగి తీసుకురావాలనే ప్రతిపాదన చాలాసార్లు వచ్చింది. కానీ రాజకీయ మార్పుల కారణంగా ప్రతిసారీ ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది. అయితే, 1991లో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విజయంతో పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఏర్పడినప్పుడు, సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. భారత ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి రక్షించేందుకు మన్మోహన్ సింగ్ అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్న సమయం అది. ఆయన భారత రూపాయి విలువను తగ్గించారు. పారిశ్రామిక లైసెన్సింగ్ వ్యవస్థను సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన అనుసరిస్తున్న ఈ విధానాలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేసి ప్రపంచ స్థాయిలో బలోపేతం చేశాయి.
రాజకీయ నాయకుడిగా
1991లో ఆర్థిక మంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ క్రమంగా రాజకీయ నాయకుడిగా స్థిరపడ్డారు. 1996లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ రాజకీయాలకు దూరం కాకుండా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు. 1991లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మన్మోహన్ సింగ్ చాలా ఏళ్లపాటు సమర్థవంతమైన రాజకీయాలను ఆచరించారు. 1996 నుంచి 1997 వరకు పార్లమెంట్ ట్రేడ్ కమిటీ చైర్మన్గా పనిచేసిన ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఈ కాలంలో, ఆయన భారత రాజకీయాల్లో తన స్థిరత్వాన్ని కొనసాగించారు. దేశంలోని వివిధ సమస్యలపై తన బలమైన గొంతుకనిచ్చారు.
రాజకీయాల్లో ముఖ్యమైన మలుపు
మన్మోహన్ సింగ్ ప్రధాని కావడం అనేది రాజకీయాల్లో ఆసక్తికర మలుపు. 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సోనియాగాంధీని ప్రధాని కావాలని ప్రతిపాదించగా, ఆ బాధ్యతను ఆమె మన్మోహన్ సింగ్కు అప్పగించారు. ఈ నిర్ణయం చాలా మందికి ఊహించనిది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ రాజకీయ మద్దతు ఆ సమయంలో అంత బలంగా లేదు. కానీ ఆయన ఆర్థిక అవగాహన, విధాన నిబద్ధత ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది. ఆ విధంగా 2004లో మన్మోహన్ సింగ్ భారతదేశానికి 14వ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. విదేశాలతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. అనేక ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్, అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది మన్మోహన్ హయాంలోనే. ఈ ఒప్పందం అణుశక్తి విషయంలో భారత్కు ప్రపంచ వేదికపై కొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది.
కెరీర్లో సవాళ్లు, వివాదాలు
మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన తర్వాత ఆయన పదవీకాలం కూడా వివాదాలతో చుట్టుముట్టింది. తన రెండవ టర్మ్లో, ప్రభుత్వ విధానాలు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాలపై విమర్శలు వచ్చాయి. వీటిలో బొగ్గు గనుల కేటాయింపు, టెలికాం కుంభకోణం, రెట్రోస్పెక్టివ్ పన్ను వంటి కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో మన్మోహన్ సింగ్ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారని ఎప్పుడూ ఆరోపించనప్పటికీ, ఈ వివాదాలు ఖచ్చితంగా ఆయన పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే, ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, విధాన రూపకల్పనలో తన నిజాయితీ, పని తీరు, ఆచరణాత్మకత కారణంగా ప్రతి సవాలును ఎదుర్కొన్నారు. దేశాభివృద్ధి, పౌరుల సంక్షేమమే తన ప్రాధాన్యత అని మన్మోహన్ సింగ్ రూపించారు.
మన్మోహన్ ఉపాధ్యాయుడు కూడా
మన్మోహన్ సింగ్ అద్భుతమైన ఉపాధ్యాయుడు కూడా. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ బోధించిన ఆయన అక్కడ తన బోధనా శైలి వల్ల విద్యార్థుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మర్యాద, ప్రశాంత స్వభావం కారణంగా, విద్యార్థులు తమ సందేహాలను సులభంగా అడిగి సమాధానాలు తెలుసుకునేవారు.
చివరి రోజులు
మన్మోహన్ సింగ్ 2009లో కరోనరీ బైపాస్ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. తన అనారోగ్యం కారణంగా తన పనిని ఎప్పుడూ ఆపలేదు. ప్రధానమంత్రిగా తన విధులను కొనసాగించారు. మన్మోహన్ సింగ్లో ఉన్న అతి ముఖ్యమైన లక్షణం ఆయన నిజాయితీ. రాజకీయాలలోకి ప్రవేశించడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించిన నాయకుడిగా భారత రాజకీయాల్లో ఆయన ఇమేజ్ ఏర్పడింది. తన చిత్తశుద్ధితో రాజీపడలేదని, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా ఆయన గౌరవం చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదే కారణమని చెబుతారు.