బీజేపీతో ఎలాంటి డీల్ లేదు : ఎంపీ అసదుద్దీన్ ఓవైసి
నిర్దశం, హైదరాబాద్ : ఇండియా కూటమిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. I.N.D.I.A కూటమిలో చేరేది లేదన్న ఆయన, ఇప్పటికే కూటమికి ఊపిరి ఆడటం లేదన్నారు. బీజేపీ ఐడీయాలజీకి వ్యతిరేకంగా ఎందుకు పని చేయడం లేదన్న అసదుద్దీన్, ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా హిందువుల ఓట్లు మాత్రం కూటమి అభ్యర్థులకు రావని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు ఎలాంటి డీల్ లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారని, వయ్నాడ్లో గెలుపొందారని గుర్తు చేశారు. వయ్నాడ్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని, అందుకే రాహుల్ గెలుపొందారని అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో చేరిక కోసం తనను ఆహ్వానించకపోవడంపై ఏఐఎంఐఎం చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇండియా కూటమిలో చేరాలని తమ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని పట్టించుకోనన్నారు. విపక్ష కూటమిలో కేసీఆర్తోపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో పలు పార్టీలు భాగస్వాములు కాలేదని గుర్తుచేశారు. ఇండియా కూటమిలోని లౌకిక పార్టీలు చెప్పుకునే పార్టీలు తమను రాజకీయంగా అంటరానివారిగా చూస్తున్నాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను కోరానన్నారు అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్ ఈ దిశగా ముందుకువస్తే… దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయవచ్చన్నారు.