ఎదిరలో ఇంటింటికి ఉద్యోగం
ఏరిపారేసినట్టుండే ఎదిర ఎంతో ఎదిగింది
– మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 21 : మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలో ఎదిర ఒకప్పుడు ఏరి పారేసినట్టుండే ప్రాంతమని, ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఇతరులకు అసూయ కలిగే విధంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన ఎదిర సమీపంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈద్గాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఎదిరకు అన్ని వైపులా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఒక మంచి రూపును తీసుకురావడం జరిగిందని అన్నారు. ఎదిర లో నివసిస్తున్న 42 కురుమ, యాదవుల కుటుంబాలకు ఉచితంగా ప్రభుత్వ ప్లాట్లు ఇవ్వడం జరిగిందని, మూడు కోట్ల రూపాయలతో పాఠశాల నిర్మాణం, గిరిజన వసతిగృహం, ఇటుపక్క ఐటీ టవర్, మెడికల్ కళాశాల ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మరో వైపు కేసీఆర్ ఎకో పార్కు, బైపాస్ రహదారి ఏర్పాటు చేశామని, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చామని తెలిపారు.
మే 6వ తేదీన ఐ టి టవర్ లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు చెందిన కంపెనీలను ఏర్పాటు చేయబోతున్నారని ,అదేరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐటి కారిడార్ వల్ల ఎదిరలో ఇండ్లు, ప్లాట్లు, భూముల విలువలు పెరిగాయని తెలిపారు. గతంలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం పట్టా భూములు సేకరిస్తే ఎకరాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని, అదే ఐటి పార్కులో భూముల సేకరణ సందర్బంగా ప్రభుత్వ అసైన్ భూములను సేకరించినప్పటికీ ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత తమదని మంత్రి తెలిపారు.
8 ఏళ్లలో ఎదిర ఎంత అభివృద్ధి చెందిందో ఆలోచించాలని అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం నలుమూలల ఆత్మగౌరవ భవనాలతో పాటు, గ్రేవీ యార్డులు నిర్మించామని, ముదిరాజులకు, చేనేత కార్మికులకు, యాదవులకు అన్ని కులాలకు ఆర్థిక సహకారం అందజేశామని తెలిపారు.
గ్రామాలలో అందరూ కలిసికట్టుగా ఉండాలని, అందరు కలిస్తేనే సమాజంలో మార్పు తీసుకురాగలమని అన్నారు. ఎదిరలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని, చదువును బట్టి కనీసం 25 వేల నుండి లక్షల రూపాయల జీతం పొందేలాగా అవకాశాలు కల్పించనున్నామని, మహబూబ్ నగర్ లో పేదరికం అన్నదే ఉండకూడదన్నది తమ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, కౌన్సిలర్ ఉమర్ ,నసీరుద్దీన్ ,షబ్బీర్ ,మాజీ సర్పంచ్ జంగయ్య తదితరులు ఉన్నారు.