నిజాం ముకరంజా మృతి
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్లో తుది శ్వాస విడిచారు. ఆయన కుటుంబం తరపున హైదరాబాద్లోని ఆయన కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది.
ఆయన వయసు 89 సంవత్సరాలు. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్కు ఆయన మనుమడు, వారసుడు.
ముకరం జా అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్.
ఆయన శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్లో తుదిశ్వాస విడిచినట్లు హైదరాబాద్లోని ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది.
ఆయన కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూలును విడుదల చేస్తామని తెలిపింది.
మిర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతుల కుమారుడైన ముకరంజా 1933 అక్టోబరు 6న జన్మించారు.
ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ (ఒట్టోమన్ సామ్రాజ్యం) చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె. ఆమె దాదాపు 20 ఏళ్ళ క్రితం మరణించారు..