విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బిఆర్ఎస్
ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం
కెసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు
బిఆర్ఎస్ నేతలు కనిపిస్తే ఎక్కడిక్కడ నిలదీయండి
చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని హితవు
ఎస్సీ గురుకుల టాపర్లకు బహుమతులు అందించిన రేవంత్
హైదరాబాద్, నిర్దేశం :
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండపడ్డారు. తమ ఇంట్లో ఉద్యోగాలు వస్తే చాలనే ధోరణిలో నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. బుధవారం హైదరాబాద్లోని బాబూ జగజ్జీవన్రామ్ భవన్లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల విూదగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకున్న పిల్లలకు తాము ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 59 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. గత 15 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. తమ హయాంలో 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్నామని వివరించారు. గ్రూప్-1లో 89శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయని సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు. ఈ రోజు అంటే బుధవారం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించేం దుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామన్నారు. కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని ఆయన స్పష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆత్మనూన్యత భావాన్ని వీడాలంటూ దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. వారిలోని ఆత్మనూన్యత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తెచ్చారని గుర్తు చేశారు. కానీ విూకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.